Friday, June 21, 2019

ప్రభవిస్తున్న ‘ఏకపక్ష’ భారత్ !

ప్రభవిస్తున్న ‘ఏకపక్ష’ భారత్ !
21-06-2019 03:47:07

17వ లోక్ సభ ‘ప్రతిపక్షం లేని’ పార్లమెంటులా కన్పిస్తోంది. నిరంకుశ పాలకుని నేతృత్వంలోని ఒక ఆధిపత్య పార్టీ సకల వ్యవహారాలను నిర్దేశించనున్నది. కేబినెట్ మంత్రుల ఎంపికలో ప్రధాని మోదీ తీరుతెన్నులు, పార్లమెంటరీ వ్యవస్థపై అధ్యక్ష తరహా పాలనా నమూనాను రుద్దడానికి ఆయన సంకల్పించినట్టు ఇప్పటికే స్పష్టం చేసాయి. మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఒక తీవ్ర సంస్థాగత సంక్షోభానికి, బహుశా, అదొక సూచన!

కొత్త లోక్‌సభ కొలువుదీరిన వేళ... పాలక పక్షం వారి ‘జై శ్రీరామ్’ నినాద ఘోషలో కొత్త శాసన నిర్మాతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాజ్యాంగ విధిని నిర్వహించిన ప్రతిపక్ష ఎంపీ ఒకరు, విచార మగ్నుడై సెంట్రల్ హాల్‌లోకి నెమ్మదిగా ప్రవేశిస్తూ ‘మోదీ ప్రభుత్వానికి ప్రజలు పదేళ్ళ పాటు అధికారాన్ని కట్టబెట్టినట్టుగా కన్పిస్తోంద’ని నిట్టూర్చారు. ఆ ఎంపీ వ్యాకులత విస్మయకరమైన విషయమేమీ కాదు. ప్రతిపక్ష సభ్యులు కూర్చుండే స్థానాలు ఖాళీగా కన్పిస్తున్నాయి. గత సభలో అక్కడ కూర్చున్న పాత కాపులు చాలా మంది కానరావడం లేదు. నిండుదనం, ఒక విధంగా వెలవెలబోయింది. మన గణతంత్ర రాజ్యపు వర్తమాన అస్తిత్వాన్ని 17వ లోక్‌సభ ప్రతిబింబిస్తున్నట్టయితే, మనం ఒక ఏక ధ్రువ భారత దేశంలోకి ప్రవేశిస్తున్నామని చెప్పక తప్పదు. జాతి జీవనంలోని విలక్షణ వైవిధ్యాలన్నీ క్రమక్రమంగా వెనక్కి తగ్గుతూ కాషాయీకరణ పొందిన రాజ్య వ్యవస్థకు దారి నిస్తున్నాయి మరి.

ప్రతిపక్షాలు ఇంత అధ్వాన్నంగా, అస్తవ్యస్తంగా, నిరుత్సాహంగా, బహుశా, భారత పార్లమెంటు చరిత్రలో ఇంతకు ముందెన్నడూ కన్పించ లేదనడం సత్యదూరం కాదు. 1984లో సైతం (రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కంటే అత్యధిక మెజారిటీని సాధించింది) ప్రతి పక్షాలు ఇప్పటిలా జావకారిపోలేదు. అప్పుడు కనీసం పార్లమెంటు లోపలా, వెలుపలా అతిరథ మహారథులైన విపక్ష నాయకులు పలువురు వున్నారు. అటల్ బిహారి వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ, జార్జి ఫెర్నాండెజ్, చంద్రశేఖర్ మొదలైన వారు ప్రజల సమస్యలపై ఆవేశపూరితంగా, అర్థవంతంగా తమ గొంతు విప్పేవారు. పాలకుల్లో కదలిక తెచ్చేవారు. బీజేపీ కూడా ప్రజా జీవనంలో చాలా ఉత్సాహంగా పాల్గొనేది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎల్ల వేళలా దానికి బాసటగా ఉండేది. వామపక్షాల మహాచురుకైన క్రియాశీలత కించిత్ కూడా తగ్గని కాలమది. ఎన్‌టి రామారావు, రామకృష్ణ హెగ్డే లాంటి ప్రాంతీయ అధినేతలు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను చావు దెబ్బ దీయడం విస్మరించలేని చరిత్ర. అంతకు ముందు నెహ్రూ, ఇందిర రోజుల్లో కూడా గొప్ప ప్రతిపక్ష నాయకులు పలువురు వుండేవారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా సహేతుక వాదనలు చేసి ప్రజలనే కాక పాలకులను కూడా ఒప్పించే వారు.

మరి నేటి ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి? మహా శోచనీయం. వాటి అవస్థలకు అంతులేదు. పాలక బీజేపీని అవి ఎందుకు సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాయి? అనిశ్చితి, అరాచకత్వంలోకి కాంగ్రెస్ పార్టీ కొట్టుకు పోతున్నట్టుగా కన్పిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పరిత్యజించాలని రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం పార్టీలో ఒక శూన్యాన్ని సృష్టించింది. అంతర్గత గందరగోళం మరింత తీవ్రమవకుండా ఆ శూన్యం భర్తీ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులలో దేశవ్యాప్తంగా సుపరిచితులు, సుప్రసిద్ధులైన నేతలు ఎవరూ లేరు. పార్లమెంటరీ వ్యవహారాలలో అంతగా అనుభవం లేనివారే ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నారు. రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ అయితే వున్నారు. ఆయన సభ్యత్వ కాలం ముగియనుండడంతో పెద్దల సభలో కాంగ్రెస్ పెద్ద దిక్కును కోల్పోనున్నది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌లో నెలకొనివున్న అయోమయం ఆ పార్టీలో అంతర్గతంగా నెలకొనివున్న నిర్ణయ రాహిత్యాన్ని ప్రతిబింబిస్తోంది.

మరి ఇతర ప్రతిపక్షాల పరిస్థితీ ఇంతకంటే మెరుగ్గా లేదు. అవీ దుర్భల, అనిశ్చిత భవిష్యత్తునే ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు రాజకీయ ఆందోళనలు, ఉద్యమాలలో అగ్రగాములుగా ఉన్న వామపక్షాలు ఇప్పుడు లోక్‌సభలో మూడు స్థానాలకే పరిమితమయ్యాయి. పార్లమెంటులో మూడో అతి పెద్ద పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్ళతో సతమతమైపోతోంది. తన కంచుకోట బెంగాల్‌లో ఆ జాతీయ పార్టీ పలు స్థానాలను గెలుచుకోవడం తృణమూల్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. ఆ దిగ్భ్రాంతి నుంచి ఆ పార్టీ ఇంకా పూర్తిగా తేరుకోలేదు. బెంగాల్ లో బీజేపీ పురోగతిపై తృణమూల్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కలవరపడుతున్నారు. తన ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడిన రీతిగా ఆమె రాజకీయ ప్రతిస్పందనలు ఉంటున్నాయి. ఒక పటిష్ఠ ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందక ముందే బహుజన్ సమాజ్ పార్టీ –- సమాజ్ వాదీ పార్టీ కూటమి కథ మళ్ళీ మొదటికి చేరింది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ కేంద్రంలోని అధికార పార్టీతో సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి.

17వ లోక్ సభ ‘ప్రతిపక్షం లేని’ (అపోజిషన్ -ముక్త్) పార్లమెంటులా కన్పిస్తోంది. నిరంకుశ పాలకుని నేతృత్వంలోని ఒక ఆధిపత్య పార్టీ సకల వ్యవహారాలను నిర్దేశించనున్నది. కేబినెట్ మంత్రుల ఎంపికలో ప్రధాని మోదీ తీరు తెన్నులు, పార్లమెంటరీ వ్యవస్థపై అధ్యక్ష తరహా పాలనా నమూనాను రుద్దడానికి ఆయన సంకల్పించినట్టు ఇప్పటికే స్పష్టం చేసాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేయగల సమర్థ నాయకుడు ఒక్కడైనా ప్రభుత్వంలో గానీ, ప్రభుత్వం వెలుపల గానీ ఉన్నట్లు కన్పించడం లేదు. మోదీ నిర్ణయాలను ప్రశ్నించగల ధైర్యసాహసాలు ఏ కేబినెట్ మంత్రికీ లేవు. ప్రధాని ఆదేశాన్ని మౌనంగా పాటించవలసిందే. కేంద్ర కేబినెట్‌లో అధికారికంగా ‘ద్వితీయ’ స్థానంలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌కు వివిధ కీలక కేబినెట్ కమిటీలలో స్థానం కల్పించకపోయినా ప్రశ్నించిన వారు ఎవరూ లేకపోవడమే అందుకు నిదర్శనం. తాము అడిగిన మంత్రిత్వ శాఖలను కేటాయించలేదన్న అసంతృప్తితో రగిలిపోతున్న నితీశ్ కుమార్ (యునైటెడ్ జనతా దళ్), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) లాంటి మిత్రపక్షాల నాయకులు కూడా మౌనంగా ఉండిపోక తప్పని పరిస్థితి.

ఇలా ‘ప్రతిపక్షం లేని’ పార్లమెంటు అనేది మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఒక తీవ్ర సంస్థాగత సంక్షోభానికి, బహుశా, ఒక సూచన! మరి ప్రశస్త పాలనకు దోహదం చేసే ప్రజాస్వామిక నిరోధ సమతౌల్యాలు (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) తీవ్ర ఒత్తిడికి లోనుకాకుండా ఎలా ఉంటాయి? ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో మూల స్తంభమైన మీడియా, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను నిశితంగా విమర్శించడంలో ఘోరంగా విఫలమయిందని 2019 సార్వత్రక ఎన్నికల ప్రచారం స్పష్టంగా వెల్లడించింది. చాలా పత్రికలు, ఛానెల్స్ పిరికితనంతో వ్యవహరించాయి. సత్యాలను ఎలుగెత్తి చాటలేకపోయాయి. తమ విధ్యుక్త ధర్మనిర్వహణను గర్హనీయంగా ఉపేక్షించాయి. రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరిస్తున్న వ్యవస్థగా న్యాయవ్యవస్థను ప్రజలు అమితంగా గౌరవించేవారు. అయితే ఇటీవల న్యాయవ్యవస్థ నిష్కాపట్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ న్యాయమూర్తులు చాలా అనౌచిత్యంగా వ్యవహరించడమే అందుకు కారణం.

విధాన నిర్ణయాలన్నీ ‘సర్వోన్నత నాయకుడే’ తీసుకోవడం పరిపాటి అయింది. అధికారాలన్నీ ఆయనవే. ఆయనదే తుది మాట. ఇటువంటి పాలనా నమూనా హానికర ప్రభావాలు 16వ లోక్ సభ హయాంలోనే ప్రజల అనుభవంలోకి వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌ను, ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించడం; ఆధార్ లాంటి కీలక బిల్లులకు ద్రవ్య బిల్లులుగా పార్లమెంటు ఆమోదాన్ని పొందడం రాజ్యాంగ విహితం ఎంత మాత్రం కాదు. సీనియర్ మంత్రులకు కూడా, తాము నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించిన నిర్ణయాలు ముందుగానే తెలియకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నోట్ల రద్దు లాంటి వివేకరహిత నిర్ణయాలు ప్రజలను ఎనలేని అవస్థలకు గురి చేసినప్పటికీ, వాటికి వ్యతిరేకంగా కార్యసాధక ఉద్యమాలను ప్రతిపక్షాలు నిర్మించలేక పోయాయి. మరి ఇటువంటి పరిణామాలు మన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని తీవ్ర ఒత్తిళ్ళకు గురి చేస్తున్నాయనడంలో సందేహమేమీ లేదు.

జర్నలిస్టులపై భౌతిక దాడులు పెరిగిపోయాయి; పలువురు పాత్రికేయులకు జైలుశిక్షలు విధించారు; జమ్మూ-కశ్మీర్ శాసనసభలో ప్రాతినిధ్య జనసంఖ్యలో మార్పులకు రహస్య ప్రయత్నాలు జరుగుతున్నాయి; ఆర్థిక వ్యవస్థ పురోగతి సజావుగా లేదు; స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు సక్రమమైనవి కావు.. మరి ఈ అవకతవకలకు, అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తేదెవరు? నరేంద్ర మోదీ మొదటి ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ తలాక్, భూ స్వాధీన సవరణ బిల్లు మొదలైన వివాదాస్పద అంశాలపై కార్యనిర్వాహక వర్గం చెలాయించిన అపరిమిత అధికారాలను రాజ్యసభలో తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. మోదీ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వల్లే ఆ ప్రతిఘటనకు ఆస్కారం కలిగింది.

పార్లమెంటరీ ప్రక్రియలను మోదీ సర్కార్ ఉల్లంఘించలేకపోయింది. అయితే వచ్చే ఏడాది రాజ్యసభలో బీజేపీ పూర్తి మెజారిటీ సంపాదించుకోనున్నది. ఉభయ సభల్లోనూ పూర్తి మెజారిటీ ఉన్న ఫలితంగా పాలకులు నిర్భయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఎంతైనా ఉన్నది. మరి ఆ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు సవాల్ ఎక్కడి నుంచి రావాలి? రాజీవ్ గాంధీ పాలనలో ప్రభుత్వం నుంచే అటువంటి సవాల్ వచ్చింది. రక్షణ శాఖ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతికి వ్యతిరేకంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ధ్వజమెత్తారు. 1987లో ఆయన ప్రభుత్వం నుంచి వైదొలగి, కాంగ్రెస్ నుంచి నిష్క్రమించినప్పుడు రాజీవ్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. 1971లో ఇందిరాగాంధీ చరిత్రాత్మక విజయం సాధించారు. అయితే కొద్దికాలానికే పెచ్చరిల్లిపోయిన అవినీతి, పెరిగిపోతోన్న ధరలకు వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఇందిర అత్యవసర పరిస్థితిని విధించారు. ఇవన్నీ ఆమెకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సమైక్యం కావడానికి దోహదం చేశాయి. సార్వత్రక ఎన్నికలలో వరుసగా రెండో సారి ఘన విజయం సాధించిన నరేంద్ర మోదీ తన అధికార ప్రాభవంలో నిస్సందేహంగా ఇందిరాగాంధీ కంటే శక్తిమంతుడు. పైగా ప్రతిపక్షాలు పూర్తిగా అపఖ్యాతిపాలయివున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలను గట్టిగా ప్రశ్నించేదెవరు? ఇందుకు పౌర సమాజమే చొరవ తీసుకోవాలి. ‘జాతి -వ్యతిరేకుడు’ అనే నిందను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజాశ్రేయస్సుకు తోడ్పడని ఆర్థిక విధానాలను, రాజ్యాంగంలో మార్పులు చేయడానికి జరిగే ప్రయత్నాలను గట్టిగా ప్రశ్నించి తీరాలి.
రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Thursday, June 20, 2019

బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం

బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం

రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏకు 102 మంది సభ్యులున్నారు. వీరిలో బీజేపీ సభ్యులు 71 మంది మాత్రమే. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాలకు త్వరలో నిర్వహించే ఎన్నికలతో రాజ్యసభలో బీజేపీకి కొత్తగా మరో నలుగురు సభ్యులు చేరనున్నారు. దీంతో బీజేపీ బలం 75కు, ఎన్‌డీయే బలం 106కు పెరుగుతుంది. కానీ కీలక బిల్లుల ఆమోదానికి ఈ మెజార్టీ సరిపోదు. ‘ఒక దేశం... ఒకే ఎన్నికలు’ ‘ట్రిపుల్‌ తలాక్‌ రద్దు’ తదితర బిల్లులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేలా చూడాలన్నది బీజేపీ వ్యూహం.

పార్టీ మూల సిద్ధాంతాలకు సంబంధించిన 370 ఆర్టికల్‌ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి తదితర బిల్లులను కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది బీజేపీ యోచన. ఈ నేపథ్యంలో కీలక బిల్లులు ఆమోదం పొందేలా చూసేందుకు 2020 నాటికి రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అందుకోసం అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తమతో టచ్‌లోకి రావడంతో వారితో చర్చించే బాధ్యతను రాం మాధవ్, కిషన్‌రెడ్డిలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరితో టీడీపీ ఎంపీల చర్చలు దాదాపు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ కీలక నేత ఒకరిని ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంతో పార్లమెంట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లోనే రాజ్యసభలో తమ బలం పెంచుకునేలా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తుండగా, టీడీపీని వీడేందుకు ఆ పార్టీ ఎంపీలు సమాయత్తం కావడం రాజకీయాలను రక్తి కట్టిస్తోంది